ఘోర ప్రమాదం : ఐదుగురు మృతి

Jan 29,2024 09:06 #Fatal accident, #Five, #people died

నల్గొండ : నల్గొండలో ఆదివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అద్దంకి, నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై కారును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

రెండు కుటుంబాలు ఒకే కారులో దైవ దర్శనాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదానికి గురయ్యాయి. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరే సందర్భంలో.. వెనుక నుంచి ఓ లారీ వేగంగా దూసుకొచ్చి కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. ఒక మహిళ తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం, మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేశ్‌ (32), ఆయన భార్య జ్యోతి (30), వీరి కుమార్తె రిషిత (6)లతోపాటు మహేశ్‌ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన భూమా మహేందర్‌ (32), ఆయన భార్య మాధవీ, వీరి కుమారుడు లియాన్సీ (2)లు కారులో ప్రయాణిస్తున్నారు. వీరంతా ఎపిలోని విజయవాడ, ఇతర ప్రాంతాల్లోని దైవ దర్శనాలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. నందిపాడు కాలనీకి వస్తుండగా.. ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహేశ్‌, జ్యోతి, రిషిత, భూమా మహేందర్‌, లియాన్సీలు అక్కడికక్కడే మరణించారు. మాధవి గాయాలతో బయటపడింది. మిర్యాలగూడ ప్రాంతీయ హాస్పిటల్‌లో ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. ఆ తర్వాత ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. ఆ లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️