ప్రత్తిపాడు (కాకినాడ) : కాకినాడలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై లారీ పంక్చర్ అవ్వడంతో నలుగురు ఆ లారీకి మరమ్మతులు చేస్తుండగా, ఆర్టిసి బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈరోజు తెల్లవారుజామున ఒడిశా నుంచి బాపట్ల వైపు వెళుతున్న లారీ టైరు పంక్చర్ కావడంతో ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఆగిపోయింది. రోడ్డు పక్కన లారీని ఆపి నలుగురు ఆ లారీకి మరమ్మతులు చేస్తుండగా, అదే సమయంలో విశాఖ నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న ఎపిఎస్ఆర్టిసి బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీకి మరమ్మతులు చేస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సును ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు సిఐ శేఖర్బాబు, ఎస్సై పవన్కుమార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతులను నక్కబొక్కలపాడుకు చెందిన లారీ డ్రైవర్లు … దాసరి కిషోర్, దాసరి సురేశ్, బండి నాగయ్య, దిమ్మిలి రాజుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన బస్సు వివరాలను సేకరించారు. ఆ ఆర్టిసి బస్సును పోలీసులు రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు వద్ద పట్టుకున్నారు. మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.