- నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విద్యారంగంలో నిరంతరం చోటుచేసుకుంటున్న మార్పులకనుగుణంగా అధ్యాపకులు సైతం నైపుణ్యంపై దృష్టిసారించి, అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ పేర్కొన్నారు. నిరంతర శిక్షణ ద్వారానే సాంకేతిక విద్యా వ్యవస్థలో మంచి ఫలితాలను సాధించగలుగుతున్నామని తెలిపారు. విజయవాడలోని ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్న అటల్ ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాన్ని మంగళవారం పరిశీలించారు. డిసెంబరు 9 వరకు ఈ కార్యక్రమం జరగనుండగా, ‘అడ్వాన్స్మెంట్ ఆన్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఫ్రమ్ థియరీ టు ప్రాక్టీస్’ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. పాఠ్యాంశాల అభివృద్ధి మార్గదర్శకత్వం కోసం పరిశ్రమలోని నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ ధనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్, సెక్రటరీ ధనేకుల భవానీ ప్రసాద్, డైరెక్టర్ డికెఆర్కె రవి ప్రసాద్, ప్రిన్సిపల్ కడియాల రవి తదితరులు పాల్గొన్నారు.