- 25 వరకు నమోదుకు అవకాశం
ప్రజాశక్తి -పెనుకొండ :కవికాకి కోగిర జైసీతారామ్ శతజయంతిని పురస్కరించుకుని సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల ‘జలకవనం’ కార్యక్రమాన్ని మార్చి మూడున శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ హరి ఆధ్వర్యంలో సోమవారం పెనుకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ ఎం.ప్రగతి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాగు, తాగునీటి కష్టాలను తెలియజేసేలా రాయలసీమ స్థాయి ‘జలకవనం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో గగన్మహల్ కేంద్రంగా మార్చి మూడున ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఏ రాష్ట్రం వారైన జలకవనంలో పాల్గొని కవితలు, పాటలు, పద్యాలు వినిపించవచ్చునని, వాటన్నింటిని కలిపి సంకలనం తెస్తామన్నారు. జలకవనంలో పాల్గొనాలనుకునే కవులు ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం ఎ.హరి 9491355000, రాజశేఖర్ రెడ్డి 944508510 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.