ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మెగా డిఎస్సి పేరుతో వైసిపి ప్రభుత్వం యువతను నిలువునా మోసం చేసిందని, రాష్ట్రంలో 25 వేల నుంచి 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం దారుణమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు పేర్కొన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకు నోటిఫికేషన్ డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసిన డిఎస్సి అభ్యర్థుల సమస్యలను నాగబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిఎస్సి అభ్యర్థులకు టిడిపి, జనసేన ప్రభుత్వంలో తప్పక న్యాయం చేస్తామన్నారు. రాష్ట్రంలో టెట్ క్వాలిఫై అయినవారు సుమారు 10 లక్షల మంది వరకు ఉన్నారని, వీరందరూ డిఎస్సి రాయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.