ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ :
మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి వైసిపికి రాజీనామా చేశారు. శ్రీకాకుళంలోని హోటల్ గ్రాండ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె ఈ మేరకు తెలిపారు. వైసిపి తనకు ఏ మాత్రమూ ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించినా అపాయింట్మెంట్ లభించకపోవడంతో పార్టీలో కొనసాగలేక ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అన్ని పార్టీల నుంచీ తనకు ఆహ్వానం ఉందని, కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలో చేరేదీ త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. కాగా, కృపారాణి 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపిగా పోటీ చేసి కె.ఎర్రన్నాయుడుపై విజయం సాధించి సంచలనం సృష్టించారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆమె మళ్లీ కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/32-1.jpg)