నంది నాటకోత్సవాల్లో అద్భుత నటనతో ఆకట్టుకుంటున్న నటీనటుల
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రదర్శిస్తున్న నంది నాటకోత్సవాలు బుధవారం ఐదో రోజు ఆహ్లాదభరితమైన వాతావరణంలో కొనసాగాయి. నాటక ప్రదర్శనలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఐదో రోజు ఏడు నాటికలు ప్రదర్శించారు. మొదటి తెలుగు వచన వాజ్ఞయాచార్యుడిగా గుర్తింపు పొందిన రచయిత మిరియాల లక్ష్మీపతి శ్రీకాంత కృష్ణమాచార్యులు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘కృష్ణమాచార్యులు’ నాటకం సభికులను ఆకట్టుకుంది. ‘ప్రపంచతంత్రం’ బాలల నాటికను విజయవాడకు చెందిన న్యూస్టార్ మోడరన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రదర్శించారు. విన్నకోట రాజేశ్వరి రచనకు డాక్టర్ ఎంఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. డాక్టర్ రామన్ ఫౌండేషన్, సాయిబాబా నాట్యమండలి విజయవాడ వారి విజ్ఞాన భారతం సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. గుంటూరు వారు అభినయ ఆర్ట్స్ రూపొందించిన ‘అతీతం’ నాటికలో వింత జబ్బులా తయారైన ప్రంచీకరణను, దాని ఫలితాలను విశ్లేషిస్తూ ప్రదర్శించారు. అహంకారం, అపార్థం ఎంతటి పతనానికైనా దారితీస్తాయని రుజువు చేసిన ‘కపిరాజు’ నాటిక సభికులను ఆకట్టుకుంది. మనుషుల్లో మానవత్వం మంటగలసిపోయి, జాతి, మత ద్వేషాలతో దేశాలు రగిలిపోతున్న అంశాల ఆధారంగా రూపొందించిన ‘కొత్తపరిమళం’ నాటిక సందేశాత్మకంగా సాగింది. పిన్నమనేని మృత్యుంజయరావు రచనకు ఆర్.వాసుదేవరావు దర్శకత్వం వహించిన ‘రాతిలో తేమ’ నాటిక విశేషంగా ఆకట్టుకుంది. మానవత్వానికి, దానవత్వానికి మధ్య జరిగిన సంఘర్షణను ఇతివృత్తాంతంతో ుంచి సందేశమిచ్చింది. నాటికల ప్రదర్శనల్లో ఎఫ్డిసి చైర్మన్ పోసాని కృష్ణమురళీ తదితరులు పాల్గొన్నారు.