తుపాను పట్ల అప్రమత్తం : సిఎం జగన్‌

Dec 5,2023 17:55 #cm jagan
  • తగిన చర్యలు తీసుకోవాలి
  • కలెక్టర్లకు కీలక ఆదేశాలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మిచౌంగ్‌ తుపాను పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి తుపాను పరిస్థితులపై అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. శిబిరాల్లో ఆహారం, తాగునీరు, విద్యుత్‌, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయా విభాగాలను సిఎం ఆదేశించారు. తుపాను పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులను చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సోమవారం ఉదయం మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేస్తానన్నారు. అలాగే పొలాలు, కళ్లాల్లోని ధాన్యం తడిచిపోకుండా పౌరసరఫరాలశాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం తడిచిపోకుండా వెంటనే మిల్లులకు తరలించే బాధ్యతను తీసుకోవాలన్నారు. తేమ వంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్రూర్‌ చేసి, భద్రమైన ప్రాంతాలకు తరలించాలని సిఎం స్పష్టం చేశారు. తుపాను కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జలవనరులశాఖ అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో భారీ వర్షాలు కారణంగా వచ్చే పరిస్థితులను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని, తుపాను అనంతరం యుద్ధ ప్రాతిపదికన ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

➡️