Skip to content
- విశాఖ గాజువాక భారీ ర్యాలీ, సభలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు
ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో
వచ్చే ఎన్నికల్లో గాజువాక సిపిఎం అభ్యర్థి ఎం.జగ్గునాయుడు, విశాఖ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి, పశ్చిమంలో సిపిఐ అభ్యర్థి విమల విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే స్టీల్ ప్లాంట్కు రక్షణ, ప్రజా కార్మిక పోరాటాలకు బలం అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఉద్ఘాటించారు. స్టీల్ ప్లాంట్ గేట్ బిసి చెరువు స్టీల్ ప్లాంట్ వద్ద గురువారం ఉదయం ఇండియా బ్లాక్లోని సిపిఎం, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన సభకు అయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ గేట్ ముందు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఃఈ రోజున ఏకకాలంలో జరుగుతున్న పార్లమెంట్, శాసనసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎన్నికల్లో మూడు పక్షాలు పోటీల్లో నిలిచాయి. మొదటిది అధికారపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరొకటి కేంద్ర అధికార పక్షమైన బిజెపి, దానితో అంటకాగుతున్న టిడిపి, జనసేన, మూడోది ఇండియా బ్లాక్గా ఏర్పడిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉన్నాయి. ఇందులో ఎవరిని గెలిపించుకుంటే దేశానికి, రాష్ట్రానికి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కూడా మేలు జరుగుతుందో ప్రజల నిర్ణయించాలి. నిజానికి మూడు పార్టీలు మూడు పక్షాలు ఉన్న అందులో రెండు పక్షాలకు చెందిన వైసిపి, టిడిపి, జనసేన బిజెపి ఒకటే వైఖరి. వీరు రాష్ట్రానికి ద్రోహం చేసేందుకే రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు దేశానికి రాష్ట్రానికి మేలు చేసేలా స్టీల్ ప్లాంటుకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని చూపిస్తుంది. కేవలం ఇండియా బ్లాక్ మాత్రమే రాష్ట్ర విభజన అనంతరం టిడిపి ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంది. ఆ సమయంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు సన్నాహాలు చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు టిడిపి ప్రభుత్వం చేయలేదు. అనంతరం మరో 5 ఏళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రం స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తామంటుంటే కార్మికులు, కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటాలకు ఎలాంటి మద్దతు ఇవ్వకుండా ఎలాంటి చర్యలు చేపట్టకుండా లోపయి కారీగా బీజేపీకి వత్తాసు పలికింది. ఇటీవల గాజువాక సభలో జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. అదానిని రాష్ట్రానికి రప్పించి అతనికి గంగవరం పోర్ట్ అప్పజెప్పి తద్వారా స్టీల్ ప్లాంట్ను కభళించేందుకు కుట్ర పన్నింది నువ్వు కాదా? అని జగన్ మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామంటే ఈ కార్మికుల ఐక్యత వారి పోరాటాల వల్లే సాధ్యమైంది తప్ప దీనిలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ప్రభుత్వానికి కనీసం కార్మికుల నిరసనలకు సంఘీభావం తెలిపే తీరిక కూడా లేదు. అఖిల భారత స్థాయిలో దేశంలోని ఇండియా బ్లాక్లోని అన్ని పార్టీలు మనకు అండదండలుగా నిలిచి స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు సహకరిస్తున్నాయి. రాబోయే కాలంలో ఎన్నికలు స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. జనసేన, బిజెపి గెలిస్తే మనం స్వచ్ఛందంగా ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. స్టీల్ ప్లాంట్ కు మనమే గొయ్యి తీసి భూస్థాపితం చేసినట్టు అవుతుంది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు అంతా కలిసి నేడు స్టీల్ ప్లాంట్ను బతికించాలి, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ గౌరవాన్ని బ్రతికించాలి. అది జరగాలంటే ఇటు బిజెపి కూటమి గానీ అటు వైసిపి పార్టీ కానీ ఎన్నికల్లో గెలవకూడదు. నేడు జనసేన, టిడిపి, వైసిపిలు బిజెపి పంచన చేరాయి. ఇక్కడ ఎవరు గెలిచినా పెద్దగా వ్యత్యాసం ఏమీ ఉండదు. స్టీల్ ప్లాంట్ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి అంటే ఇక్కడ సిపిఎం అభ్యర్థి జగ్గు నాయుడును గెలవాలి, అలాగే పార్లమెంట్ అభ్యర్థి సత్య రెడ్డి గెలవాలి అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఈరోజు సమస్యలపై పోరాడుతున్న కార్మికులను అదాని ఉక్కు పాదం మోపి నిర్వీర్యం చేసేందుకు పాల్గన్నారు. రేపు ఈ వైసిపి, టిడిపి కూటమి ఒకవేళ విజయం సాధిస్తే కార్మికులపై ఎలాంటి చర్యలు చేపడతారు. నేడు ఆదానీ యాజమాన్యాన్ని చూస్తే అర్థమవుతుంది. కార్మిక హక్కులను కాల రాసే ప్రభుత్వాలను వెనక్కి తిప్పి కొట్టాలని నేను సూచిస్తున్నాను. మనకు రక్షణ కలగాలంటే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఇండియా కూటమి మాత్రమే విజయం సాధించాలి. అలా కాదని బిజెపి, టిడిపి, జనసేన కూటమి విజయం సాధిస్తే మన వేలుతో మనకన్ను పొడుచుకున్నట్టు అవుతుంది. ఇండియా బ్లాక్ కూటమిలోని పార్టీలు మాత్రమే గెలవాలి. వైఎస్ జగన్ ప్రభుత్వం గెలవకూడదు. అప్పుడే మనం స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ కార్మికులంతా జగ్గు నాయుడు, సత్యరెడ్డికి ఓటు వేస్తే ప్రాణాలు ఇచ్చిన స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని తెలియజేస్తున్నాను. మిగతా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సిపిఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే మరింత బలం చేయకూరుతుంది. తద్వారా పోరాటాలను మరింత ఉధృతం చేసేందుకు అవకాశం ఉంటుందిః అని రాఘవులు వివరించారు. ఈ సభకు ముందు జింక్ గేట్ వద్ద భారీ బైక్ ర్యాలీ గాజువాక పురవీధులు, పట్టణం లోని పలు వార్డుల్లో సాగింది. బైక్ ర్యాలీ లో వందల సంఖ్యలో సిపిఎం శ్రేణులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు పాల్గన్నారు. సభా వేదికపై సిపిఎం రాష్ట్ర నాయకులు సి హెచ్ నరసింగరావు ప్రసంగించారు.