ఓయూ విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష విరమణ

Jul 2,2024 12:15 #End, #Hunger Strike, #OU student

హైదరాబాద్‌: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆస్పత్రి వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఓయూ విద్యార్థి మోతిలాల్‌ నాయక్‌ ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. మీడియా ముందు కొబ్బరి నీళ్లు తాగి దీక్షను విరమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నామని తెలిపారు. తన తొమ్మిది రోజుల దీక్షలో ఒక్క ఉద్యోగం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న పానియాలు లేకుండా ఆమరణ దీక్ష చేస్తున్నానని తెలిపారు. దీని వల్ల నా ఆరోగ్యం సరిగా లేదన్నారు. క్రియాటిన్‌ లేవల్స్‌ పెరిగి.. కిడ్నీ, లివర్లు పాడయ్యే పరిస్థితికి వచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాల పెత్తనం పోయిన మన బతుకు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 25 నుంచి 35 సంవత్సరాల వయసు యువత ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారన్నారు.
కొత్త ప్రభుత్వం రాగానే తమ డిమాండ్లు పరిష్కరిస్తాం అన్నారన్నారు. గ్రూపు1 ను 1:100 చేయాలన్నారు. గ్రూపు 2,గ్రూపు 3 ఉద్యోగాలు పెంచాలని,డిఎస్‌సి పోస్ట్‌ పోన్‌ చేసి .. మెగా డిఎస్‌సి రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రేపటి నుంచి ఉద్యోగాల కోసం తీవ్ర పోరాటం చేస్తామన్నారు. 50,000 ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని తెలిపారు. జీవోలను రిలీజ్‌ చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చారించారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు.

➡️