ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి, పిఠాపురం :ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, పిఠాపురం భవిష్యత్తు కోసం తనను గెలిపించాలని, ఈ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తానని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ నుంచి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన అజెండా అన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తుంటే యావత్ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తనకు అండగా నిలబడినందుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి తాను నిలబడతానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధే అజెండాగా, ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా పని చేస్తానన్నారు. ప్రజల ప్రాణాలు తీస్తున్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టాల రద్దుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 2047 నాటికి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, తాగు, సాగునీటి సౌకర్యం కల్పించేందుకు, లా అండ్ ఆర్డర్ పటిష్టపరిచేందుకు కూటమి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. సెజ్లో పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి నాయకులంతా సమష్టిగా పని చేస్తామన్నారు. ఎన్నికల కోసం రాజకీయాల్లోకి రాలేదని, ఒక తరం భవిష్యత్తు కోసం వచ్చానని పేర్కొన్నారు. రోడ్ షోలో మాజీ ఎంఎల్ఎ ఎస్విఎస్ఎన్.వర్మ, కాకినాడ పార్లమెంటు అభ్యర్థి తంగెళ్ల ఉదరు శ్రీనివాస్ పాల్గొన్నారు.