ప్రజాశక్తి-అమరావతి : చట్ట నిబంధనలను అమలు చేస్తామన్న హామీని తుంగలోకి తొక్కి గుంటూరు జిల్లా, తాడేపల్లిలోని వైసిపి స్టేట్ ఆఫీసు బిల్డింగును కూల్చివేసిందంటూ ఆ పార్టీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. కూల్చివేత చర్యలకు పాల్పడిన సిఆర్డిఎ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్లపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంది. ఈ మేరకు గుంటూరు జిల్లా వైసిపి అధ్యక్షులు ఎం శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్లో కాటంనేని భాస్కర్, నిర్మల్ కుమార్ను వ్యక్తిగత ప్రతివాదులుగా పేర్కొన్నారు. అధికారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేత చర్యలు తీసుకోరాదన్న హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారన్నారు. ఈ పిటిషన్ను వచ్చే వారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/1-2.jpg)