- పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి
ప్రజాశక్తి – వేంపల్లె : వైకాపా పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం వైఎసార్ కడప జిల్లా వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళ సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందనే చెప్పారు. కాంగ్రెసు పార్టీ మొదటి నుండి మహిళ సాధికారతకు పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పారు. అనిబ్ సెంట్, సరోజిని నాయుడు, ఇందిరాగాంధీ, సోనియాగాంధీలు పార్టీలో అత్యున్నతమైన ఎఐసిసి అధ్యక్ష పదవులు అలకరించినట్లు చెప్పారు. ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా, ఇందిరమ్మ ప్రధానిగా, మీరా కుమార్ లోక్ సభ స్పీకర్ గా ఉన్నత పదవులు అలకరించినట్లు చెప్పారు. మహిళ రాజకీయ, సాంఘిక ఆర్థిక సాధికారత కోసం కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని చెప్పారు. బాలింతలకు, గర్భవతులు, బాల బాలికల పౌష్టికాహారం లోప నివారణ కోసం 1975లోనే అంగన్వాడీలను ఏర్పాటు చేసిందని చెప్పారు. మహిళా ఆర్థిక స్వావలంబన కోసం డ్వాక్రా పథకాన్ని, పావలా వడ్డీ, సున్నా వడ్డీ, స్త్రీ నిధి పథకాలను ప్రవేశ పెట్టి మహిళాలను మహారాణులుగా చేసిందని చెప్పారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి లక్షాలాది మంది మహిళలను సర్పంచులు, ఛైర్మన్లు, మేయర్లుగా చేసిందని చెప్పారు. బాలికల బంగారు భవిష్యత్తు కోసం బంగారు తల్లి పథకం, గృహణిల కోసం అమ్మ హస్తం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. దురదృష్టవశాత్తు వైకాపా ప్రభుత్వం పాలనలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతున్నట్లు చెప్పారు. అమ్మహస్తం, బంగారు తల్లి పథకాలను రద్దు చేసిందని చెప్పారు. డ్వాక్రా మహిళల సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని రూ 5 లక్షల నుండి రూ 3లక్షలకు తగ్గించడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నట్లు చెప్పారు. తాళీ బోట్లు తాకట్టు పెట్టుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బంగారు తల్లి, అమ్మ హస్తం పథకాలను పునరుద్ధరణ చేస్తామని తులసిరెడ్డి చెప్పారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ఐసిడిఎస్ సూపర్ వైజర్ స్వర్ణలత, అంగన్వాడీ టీచర్లు శైలజా, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, రమాదేవిలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ యుఎస్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధృవకుమార్ రెడ్డి, సుబ్రమణ్యం, రామకృష్ణ, రాజా, నరసింహరెడ్డి, ఉత్తన్న, వినయ్, బాలం సుబ్బరాయుడు, బద్రి, రాఘవయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.