- సిఇఒ మీనాకు యుటిఎఫ్ వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల సందర్భంగా వివిధ కారణాలతో సస్పెండైన ఉపాధ్యాయులకు వెంటనే పోస్టింగు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాను యుటిఎఫ్ కోరింది. పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావుతో కలిసి ఫెడరేషన్ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు సచివాలయంలో మీనాను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. మాచర్ల నియోజకవర్గంలో సస్పెండైన పిఒ, ఎపిఒలకు తిరిగి రీ పోస్టింగ్ ఇవ్వాలని, ఎన్నికల విధులకు హాజరుకాలేదనే పేరుతో కొద్దిమంది ఉపాధ్యాయులను స్థానిక కలెక్టర్లు సస్పెండ్ చేశారని తెలిపారు. ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించారనే పేరుతో కొద్దిమంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని వివరించారు. వీరందరికీ తిరిగి పోస్టింగు ఇవ్వాలని కోరారు. కొద్దిమందికి జారీ చేసిన షోకాజ్ నోటీసులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వహించినన్ని రోజులకు ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్లు ఆధారంగా ఆర్జిత సెలవు మంజూరు చేసేలా తగు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వివిధ కారణాలతో సస్పెండైన వారిని రీవోక్ చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్జిత సెలవు విషయంపై ఆర్థికశాఖ అధికారుల అనుమతితో తగు ఉత్తర్వులు జారీ చేస్తామని వారికి తెలిపారు.