ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తుపాను సహాయక చర్యల్లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకూడదని, వీలైనంత తొందరగా అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. తుపాను స్థితిపై మంగళవారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అధికారులను అడిగి తుపాను వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశించారు. మనుషులు, పశువులు మరణించినట్లు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని తెలిపారు. తుపాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ కూడా ప్రారంభం కావాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్ వ్యవస్థను వాడుకుని రేషన్ పంపిణీని సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సిఎం సూచించారు.