ప్రజాశక్తి – దొరవారిసత్రం : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల పరిధిలోని కలగుంట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు మేరకు ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌతమ్ (23), మునిరత్నం (29), రాంకి(24) ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఏకొల్లు గ్రామానికి చెందిన గౌతమ్, నాయుడుపేట మండలం అట్లపాలెం గ్రామానికి చెందిన కె.మునిరత్నం, పెళ్లకూరు మండలం జీలగపాటూరు గ్రామానికి చెందిన కోగిలి రామ్ కి, వీరు ముగ్గురు ఏకోలు గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై నాయుడుపేట వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సమాచారం తెలుసుకున్న సీఐ జగన్మోహన్ రావు, ఎస్ఐ తిరుమలరావు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న మునిరత్నంను 108 వాహనం ద్వారా నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మునిరత్నం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.