ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్య, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. టిఎస్ ఎంసెట్ 2024-25 విద్యా సంవత్సరం నుంచి టిఎస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఇఎపి) సెట్గా ఉంటుందని ప్రకటించింది. మే తొమ్మిది నుంచి 13 వరకు ఎంసెట్ (ఇఎపిసెట్), మే ఆరున ఇసెట్, మే 23 ఎడ్సెట్, జూన్ మూడున లాసెట్, అదే నెల నాలుగు, ఐదు తేదీల్లో ఐసెట్, జూన్ ఆరు నుంచి ఎనిమిది వరకు పిజిఇసెట్, జూన్ 10 నుంచి 13 తేదీల్లో బిపిఇడి, డిపిఇడి పరీక్షలు నిర్వహించనున్నారు. గురువారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఆ వివరాలను విడుదల చేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/telangana-3.jpg)