ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లు చూడడమే లక్ష్యమని పల్నాడు ఎస్పీ జి.బిందు మాధవ్ అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం పల్నాడు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ బిందు మాధవ్ శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ … ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత, పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పల్నాడు జిల్లాలో తూ.చ తప్పకుండా పాటిస్తామని పోలీసు శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎవరైనా దాడులకు, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో బిందు మాధవ్ ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్ఈబి జాయింట్ డైరెక్టర్ గా, నూతన పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా విధులు నిర్వహించారు. అనంతరం పదోన్నతిపై గ్రేహౌండ్స్ వద్ద ఎస్పీగా పనిచేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/sp.jpg)