ప్రజాశక్తి-అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తును సిబిఐ లేదా ఇడితో దర్యాప్తునకు ఆదేశిస్తే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ‘స్కిల్ స్కామ్ దర్యాప్తులో అనేక అక్రమాలు జరిగినట్లుగా గుర్తించాం. మనీలాండరింగ్ కూడా జరిగింది. సిఆర్డిఎ పరిధిలో జరిగిన అసైన్డ్ భూముల స్కామ్, ఎపి ఫైబర్ నెట్ కేసులో సిఐడి 2020లోనే దర్యాప్తు చేపట్టింది. ఈ స్కామ్లపై సిబిఐ దర్యాప్తు చేయాలని కోరాం. సిబిఐ రాష్ట్రంలోకి వచ్చి దర్యాప్తునకు అంగీకారం జిఓ కూడా జారీ చేశాం. తాజా వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తే అభ్యంతరం లేదు’ అని కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నట్లు ఎజి ఎస్ శ్రీరామ్ చెప్పారు. స్కిల్ స్కామ్ దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలంటూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ దాఖలు చేసిన పిల్ను జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయితో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ జరిపింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/7-12.jpg)