విజయవాడ : ముఖ్యమంత్రిగా చంద్రబాబు రేపు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో … గన్నవరం విమానాశ్రయ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం విమాన ప్రయాణికులు ఉదయం 9 గంటల 30 నిముషాలలోపే చేరుకోవాలని ఎయిర్పోర్టు డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత రెడ్డి సూచించారు. ప్రయాణికుల విమానాలేవీ రద్దు చేయలేదని.. అన్నీ యథాతథంగా నడుస్తాయని తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, షిర్డీ వెళ్లే విమానాలు యధావిధిగా బయలుదేరతాయని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమానాశ్రయ పరిసరాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. రేపు ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడి సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు. కూటమిలోని టిడిపి, బిజెపి, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/gannavaram-airport.jpg)