ప్రజాశక్తి- ఒంటిమిట్ట :వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవాలు ‘హరిధ్రా ఘటనం’తో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది తొలిసారిగా టిటిడి ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మహిళలు సుమారు మూడు కిలోల పసుపును సంప్రదాయబద్దంగా దంచారు. అంతకుముందు గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోకళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రవణ స్వామి మాట్లాడుతూ.. హరిధ్రా ఘటనంతో సీతారామ కల్యాణ మహోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అయిందన్నారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యత వివరించారు. ఈ పసుపును కల్యాణం నాడు నిర్వహించే స్నపనం, తలంబ్రాలు తయారీకి ఉపయోగిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకలు రాఘవాచార్యులు, ఒంటిమిట్ట ప్రత్యేక అధికారి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/13-9.jpg)