– 20 మందికి పైగా గాయాలు
ప్రజాశక్తి-గోనేగండ్ల (కర్నూలు) :ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాదు నుంచిహొ ఆదోనికి వస్తున్న బిస్మిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి వద్ద ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపుతప్పి బోల్తా పడింది. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులందరూ ఒక్కసారిగ ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు క్షతగాత్రుల అర్తనాదాలు మిన్నంటాయి. ప్యాలకుర్తి గ్రామ స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిపోయిన బస్సును జెసిబి సహాయంతో నిలబెట్టారు. అప్పటికే బస్సు కింద మైదుకూరుకు చెందిన వెంకటేష్ కుమార్తె లక్ష్మి (13), సురేష్ కుమార్తె గోవర్ధని (8) నలిగిపోయి విగత జీవులుగా పడి ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న 29 మందిలో 20 మందికిపైగా గాయపడ్డారు. వీరందరినీ కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నారు. ఎస్పి. కృష్ణకాంత్ సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కోడుమూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/bus-saccident-in-kurnool.jpg)