- పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికే రానున్న కాలంలో ప్రజలు ఓట్లు వేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 1103వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్ ఇన్స్ట్రుమెంటేషన్, క్యుఎటిడి, టెలీకమ్యూనికేషన్, ఇటిఎల్, డిఎన్డబ్ల్యు విభాగాల ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ, నాయకులు యు.రామస్వామి మాట్లాడుతూ.. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎంతోమంది ప్రచార నిమిత్తం ఇక్కడికి వస్తున్నప్పటికీ స్టీల్ప్లాంట్ విషయంలో చిత్తశుద్ధితో ఎవరూ మాట్లాడటం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి అండగా నిలిచేవారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగేశ్వరరావు, వైవి.రమణ, సురేష్ పాల్గొన్నారు.ఉక్కు దీక్షలకు సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బలరాం సంఘీభావం ప్రకటించారు.