‘రాజధాని ఫైల్స్‌’ చూడండి : ప్రజలకు చంద్రబాబు పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగు ప్రజలందరూ థియేటర్లకు వెళ్లి రాజధాని ఫైల్స్‌ సినిమాను చూసి వాస్తవాలను తెలుసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతంపై కక్షగట్టి రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేసిన ప్రాంతం అమరావతి అని శుక్రవారం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక విషాదం అని, దీనికోసం కులాల కుంపట్లు రాజేశారని, విష ప్రచారాలు చేయించారని పేర్కొన్నారు. అధికార బలం మొత్తాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. ఈ కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం రాజధాని ఫైల్స్‌ అని వివరించారు. జగన్‌ క్రూరత్వానికి, వైసిపి విధ్వంసానికి నాశనమైన ఒక రాజధాని, దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ఈ చిత్రం కళ్లకు కట్టిందని తెలిపారు. అందుకే చిత్రం విడుదలను ఆపడానికి జగన్‌ శతవిధాలా ప్రయత్నించారని పేర్కొన్నారు. జగన్‌ సినిమా అయిపోయిందని, అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది కాస్కో అని సవాల్‌ విసిరారు. యాగం చేపట్టిన చంద్రబాబుచంద్రబాబు తన నివాసంలో శుక్రవారం రాజశ్యామల పేరుతో యాగం చేపట్టారు. సతీసమేతంగా ఆదివారం వరకు ఈ యాగంలో ఆయన పాల్గోనున్నారు.

➡️