ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపిని ఓడించాలి

– భువనగిరి రోడ్‌ షోలో తమ్మినేని వీరభద్రం
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపిని చిత్తుగా ఓడించాలని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం జనగామ జిల్లా పట్టణంలో భువనగిరి పార్లమెంట్‌ సిపిఐ(ఎం) ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్‌తో కలిసి.. తమ్మినేని రోడ్డు షో నిర్వహించారు. ప్రజలు పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా ఆదరించారు. అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన లక్ష్మిబాయి కుంటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో తమ్మినేని మాట్లాడారు. మూడోసారి మోడీ గెలిస్తే దేశంలో ఎన్నికలనేవే ఉండవని అన్నారు. బిజెపి.. భారత రాజ్యాంగానికి ప్రమాదకరమని, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. పదేండ్ల బిజెపి పాలనలో ప్రజలపై అధిక భారాలు మోపుతూ దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీలేదని తెలిపారు. 2017లో మోడీ.. పార్లమెంట్‌ సాక్షిగా రైతుల పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా రైతులను మోసం చేశారని అన్నారు. పైగా నల్ల చట్టాలను అమలు చేస్తూ రైతులను కాల్చిచంపిన వాళ్ళు ఓట్లను ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోగా, ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను సైతం భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను సమీక్షిస్తామన్న బిజెపి ప్రభుత్వం.. తిరిగి అధికారంలోకి వస్తే వాటిని రద్దుచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. బిజెపి కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న గొంతుకలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని విమర్శించారు. అందుకే దేశంలో మోడీ పాలనకు చరమగీతం పాడేందుకు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే భువనగిరి పార్లమెంట్‌ సిపిఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌ రమ, బుర్రి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️