యర్రజర్ల నిక్షేపాలు విశాఖ ఉక్కుకు కేటాయించండి- సిఎస్‌కు వి. శ్రీనివాసరావు లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :యర్రజర్ల కొండ ఐరన్‌ నిక్షేపాలను విశాఖ ఉక్కుకు కేటాయించాలని, జిందాల్‌కు అప్పగించేందుకు ప్రయత్నించడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డికి లేఖ రాశారు. ఒంగోలు రూరల్‌ మండలం యర్రజర్ల, టంగుటూరు మండలం కొణిజేడు, మర్లపాడు, కందులూరు గ్రామాల పరిధిలో 1,307 ఎకరాల కొండ ప్రాంతంలో ఉన్న లోగ్రేడ్‌ మాగటైట్‌ ఇనుప ఖనిజ నిక్షేపాలను జిందాల్‌కు అప్పగించడం సరైంది కాదని ఈ లేఖలో తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అవసరమని కోరినప్పటికీ కేటాయించకపోవడం రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించే చర్యని పేర్కొన్నారు. వెంటనే జిందాల్‌కు కేటాయించడాన్ని ఆపి విశాఖ ఉక్కుకు కేటాయించాలని కోరారు. ఇక్కడ ఇనుప ఖనిజంలో 30 శాతం ఐరన్‌ ఓర్‌ ఉంటుందని, బెనిఫికేషన్‌ ద్వారా ఐరన్‌ కంటెంట్‌ పెంచి స్టీలు తయారీకి వినియోగిస్తారని వివరించారు. 15 సంవత్సరాల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేటు కంపెనీల ద్వారా తవ్వకం ప్రాసెసింగ్‌, అమ్మకం చేపట్టాలని నిర్ణయించిందని తెలిపారు. గతంలో జింపెక్స్‌ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించారని, అది రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఇప్పుడు మరలా జిందాల్‌ కంపెనీకి కట్టబెట్టాలని నిర్ణయించడం దుర్మార్గమని తెలిపారు. 2023 ఫిబ్రవరి 22వ తేదీన బెనిఫికేషన్‌ కోసం టెండర్లు పిలిస్తే జిందాల్‌ దక్కించుకుందని వివరించారు. ఎంఎంఆర్‌డి చట్టం 1956కి భిన్నంగా రాబడిలో 11 శాతం, ఎండిసికి 89 శాతం జిందాల్‌ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసిందని పేర్కొన్నారు. 15 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని తవ్వే విధంగా టెండర్‌ ఇచ్చారని పేర్కొన్నారు. 2003 ధరల ప్రకారం ప్రపంచ మార్కెట్లో ఐరన్‌ ఓర్‌ టన్ను ధర రూ.4,083 ఉందని 11శాతం వాటా ప్రకారం ఎండిసికి టన్నుకు రూ.449 జిందాల్‌ కంపెనీకి 89 శాతం ప్రకారం రూ.3,638 వస్తుందని తెలిపారు. 50 లక్షల టన్నులు తవ్వితే ఎండిసికి రూ.224 కోట్లు, జిందాల్‌ కంపెనీకి రూ.1816 కోట్లు రాబడి వస్తుందని వివరించారు. భారీ లాభాలు దక్కుతాయని, ఈ చర్య రాష్ట్ర సంపదను అక్రమంగా జిందాల్‌కు అప్పగించడమే అవుతుందని తెలిపారు. వెంటనే జిందాలల్‌తో ఒప్పందం రద్దు చేసుకోవాలని, ప్రభుత్వ సంపదను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కుకు కేటాయించాలని, దీనిపై సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️