సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
కళింగ కోమట్ల సమావేశంలోమంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్
‘మీరు నాపై చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. మీ ఆదరణ, ఆప్యాయతలను ఎన్నటికీ మరువలేన’ని కళింగ కోమటి సామాజిక తరగతిని ఉద్దేశిస్తూ రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని టౌన్హాల్ వద్ద గురువారం కళింగ కోమట్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని హామీనిచ్చారు. కళింగ కోమట్లు ప్రశాంత వాతావరణంలో సజావుగా వ్యాపారాలు సాగించుకునేందుకు సహకరించానని వివరించారు. చట్టానికి వ్యతిరేకంగా, సౌమ్యులైన కళింగ కోమట్లపై పెత్తనం చేస్తానంటే మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. కళింగ కోమట్ల చారిటబుల్ ట్రస్టుకు తిరుపతిలోని మంగళం గ్రామంలో 20 సెంట్లు కేటాయిస్తూ సిఎం జగన్మోహనరెడ్డి జిఒ విడుదల చేశారని వివరించారు. ఎన్ని పార్టీలు కూటములు కట్టినా గెలుపు వైసిపిదేనని ధీమా వ్యక్తం చేశారు. కళింగ వైశ్య, భేరి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ తిరుపతిలో సత్రం కావాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అనేక సామాజిక తరగతులకు చెందిన సంఘాలు, ట్రస్టులు 236 దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కళింగ కోమట్లకు స్థలం కేటాయిస్తే మనకి గొప్ప గౌరవం దక్కుతుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు.. సిఎం జగన్మోహనరెడ్డిని కోరారని వివరించారు. కార్యక్రమంలో కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్, అంధవరపు సంతోష్, అంధవరపు ప్రసాద్, వైశ్యరాజు మోహన్, బరాటం సంతోష్, గుడ్ల మల్లేశ్వరరావు, ఊణ సంతోష్, ఊన్న నాగరాజు, పొందూరు రమణ, ఊణ సర్వేశ్వరరావు, వారణాసి కాంతారావు, కోరాడ వెంకట వరహాలు పాల్గొన్నారు.