ప్రజాశక్తి – కరప
కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమలు చేసే నియామవళిపై అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో జరిగిన ఈ సదస్సులో ఆర్డిఒ ఇట్ల కిషోర్ పాల్గొని మాట్లాడారు. రాజకీయ పార్టీల ఎన్నికల కార్యాలయాలకు అనుమతులను దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పాఠశాలలు, పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్ల దూరంలో ఉండేలా ఇవ్వాలన్నారు. గతంలో తొలగించిన ప్రచార సామాగ్రి తిరిగి ప్రచారానికి వినియోగించేందుకు అవకాశం ఇవ్వరాదని తెలిపారు ఎన్నికల ప్రచారం, కార్యాలయ నిర్వహణ, సభలు, సమావేశాలు, వాహనాల వినియోగం, మైక్సెట్ వినియోగానికి సంబంధించి ముందుగానే రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాల్సివుందన్నారు. వాటర్ ట్యాంకులు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ భవనాలు, ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవాల సందర్భంగా ఏదైన రాజకీయ పార్టీ జెండాల రంగులు ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేములవాడ సర్పంచ్ భర్త కె. భీమశంకర్ తమ వాటర్ ట్యాంకునకు వైసిపి రంగుల మాదిరిగా నీలం, తెలుపు రంగులు ఉన్నాయని, తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డిఒను కోరారు. వైసిపికి సంబంధించి మూడు రంగులు కల్గివుంటేనే తొలగించడం జరుగుతుందని ఆర్డిఒ తెలిపారు.