మాట్లాడుతున్న అప్పలసూర్యనారాయణ
మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ
శ్రీకాకుళం అర్బన్: ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా అంగీకరించ బోమని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు గుండ అప్పలసూర్యనారాయణ స్పష్టం చేశారు. అరసవల్లిలోని తన నివాసంలో కార్యకర్తలతోకలిసి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిని పార్టీ అధిష్టానంప్రకటించి నుంచి వెంటిలేటర్పైనే ఉన్నామన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు పునరాలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుని తన కుటుంబానికి ఊపిరిపోయాలని కోరారు. తన కుటుంబానికి నామినేటెడ్ పదవి అవసరం లేదని చెప్పారు. ప్రజల, కార్యకర్తల అజెండాయే తమ అజెండా అని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి వెంట నడిచిన వారంతా క్రమశిక్షణతో పనిచేశారని అన్నారు. పార్టీలో వర్గపోరుపై పలుమార్లు పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితి చక్కదిద్దలేదన్నారు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత హైకమాండ్దేనన్నారు. ఇప్పటికైనా అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుని కార్యకర్తల, ప్రజలు మనోభావాలను కాపాడాలని ఆకాంక్షించారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్, జిల్లా అధికార ప్రతినిధి ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, జల్లు రాజీవ్, కొర్ను నాగార్జున ప్రతాప్, జామి భీమశంకర్ పాల్గొన్నారు.