ప్రజాశక్తి – కాకినాడ
కాకినాడ నగర ప్రగతికి నిఘంటువు జ్యోతుల సీతారామా మూర్తి అని పలువురు వ్యక్తలు కొనియాడారు. సోమవారం కాకినాడ మున్సిపల్ మాజీ ఛైర్మన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఛైర్మన్స్ ఛాంబర్ కార్యదర్శి జ్యోతుల సీతారా మమూర్తి సంస్మరణ సభ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు అధ్యక్షతన జరిగింది. టౌన్ హాల్ సమావేశ మందిరంలో జరిగిన సంస్మరణ సభలో తొలుతగా జ్యోతుల చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజిలి ఘటించారు. కార్పోరేషన్ కార్యాలయ నూతన భవనానికి ఆయన పేరిట నామకరణం చేసి జ్యోతుల విగ్రహాన్ని నగరంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయాలని సభ తీర్మానం చేసింది. 20వ దశాబ్ద నగర స్థాయి తాగునీటి సౌకర్యాల కోసం అప్పటి పట్టణ స్థాయిలోనే చేపట్టిన పురపాలక అధ్యక్ష విజన్ అద్భుతమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బీరక చంద్రశేఖర్, మాజీ మేయర్లు పొలసపల్లి సరోజ, సుంకర పావని, సుంకర శివప్రసన్న, కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు, జి.బేబీరాణి, జవహర్ ఆలీ, వైడి.రామారావు, జాన్ జోసఫ్, ఇజాజుద్దీన్, టి.రాజా, గంగా సూరిబాబు పాల్గొన్నారు. మే 4న సివికె.రావు, జ్యోతుల సీతారామమూర్తి, కెఇ.ప్రభా జోసఫ్ పేరిట స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా ముగ్గురు యువతీ యువకులకు వారి పేరిట స్మారక అవార్డులు ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పెద్ధింశెట్టి రామకృష్ణ వందన సమర్పణ చేశారు.