రాధాకృష్ణ సతీమణి కృష్ణతులసి
ప్రజాశక్తి – తణుకురూరల్
చంద్రబాబు పరి పాలన మళ్లీ కావాలని మహిళా లోకం ముక్తకంఠంతో కోరుకుంటోందని తణుకు మాజీ ఎంఎల్ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణతులసి అన్నారు. ఆదివారం ఆమె అత్తిలి మండలం పాలూరు, వరిఘేడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసిపి దుర్మార్గ పాలన పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కృష్ణతులసి మాట్లాడుతూ వైసిపి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్లీ వస్తేనే మహిళలకు భరోసా ఉంటుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1,500, బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15,000 చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తారని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో టిడిపి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తణుకు ఆంధ్రా షుగర్స్ ప్రాంగణంలో టిడిపి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రా షుగర్స్ జెఎండి పెండ్యాల అచ్చిబాబు మాట్లాడుతూ రాధాకృష్ణ మంచి మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు. అనంతరం రాధాకృష్ణ సిబ్బందిని ఓట్లు అభ్యర్థించారు. సైకిల్ గుర్తుపై ఓటువేసి రాధాకృష్ణను గెలిపించాలని ఆరిమిల్లి రాధాకృష్ణ తనయుడు ఆరిమిల్లి నిఖిల్ రత్న తెలిపారు. ఇరగవరం మండలం అయినపర్రు గ్రామంలో నిఖిల్ రత్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.