ప్రజాశక్తి – పిఠాపురం
ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో జనసేన అధినేత, మా మావయ్య పవన్ కళ్యాణ్కు ఓటు వేసి గెలిపించాలని సుప్రీమ్ హీరో సాయి ధర్మతేజ్ కోరారు. ఆదివారం పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో ఆయన రోడ్డు షో నిర్వహించారు. మండలంలో పాత కందరాడ గ్రామంలో ప్రారంభమైన రోడ్డు కందరాడ, కుమారపురం మీదుగా చిత్రాడకు చేరుకుంది. అనంతరం గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట, తాడిపర్తి, కొడవలి, వన్నెపూడి గ్రామం వరకు సాగింది. ఆయా గ్రామాల్లో హీరోను చూసేందుకు వయస్సుతో సంబంధం లేకుండా జనాలు రోడ్డుకు ఇరువైపు ఎదురు చూశారు. రోడ్డు షో పొడవునా పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సాయి ధర్మ తేజ్ మాట్లాడుతూ తాను రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు అభిమానులు అంతా తాను క్షేమంగా ఇంటికి రావాలని పూజలు, ప్రార్థనలు చేశారని, దాని ఫలితంగానే ఆరోగ్యంగా మీ ముందుకు వచ్చాన్నారు. ప్రేక్షకుల అభిమానానికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎంఎల్ఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన మావయ్య పవన్ కళ్యాణ్కు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆయన వెంట జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్, కూటమి పార్టీల నేతలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.