ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందుకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే నిదర్శనమని పేర్కొంది. ఇవిఎంలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసిన వెంటనే పిన్నెల్లి అరెస్టు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు స్పందించింది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఇంకెవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇవిఎం డ్యామేజీకి కారణమైన మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేయడంతో ఇసిఐ ఆదర్శప్రాయమైన చర్యకు తర్కింపు ముగింపు లభించిందని పేర్కొంది. ఇవిఎంలను డ్యామేజీ చేసిన వారిని అరెస్టు చేయడమనేది ఎన్నికల సమగ్రతను కాపాడుకోవడంలో ఇసిఐ అంకిత భావానికి ఒక నిర్దిష్ట ఉదాహరణగా అభివర్ణించింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/he-Election-Commission-said-that-64.2-crore-people-voted.jpg)