ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల ప్రచారం సందర్భంగా సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో దాడి చేసిన కేసు నిందితుడు వేముల సతీష్ కుమార్ అలియాస్ సత్తికి కింది కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. నిందితుడు సతీష్కు నోటీసులు జారీ చేయకుండా, అతని వాదనలు వినకుండా ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇరువైపులా వాదనలు విన్న తరువాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. నిందితునికి నోటీసులు జారీ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది.