తెలంగాణ : తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ షెడ్యూల్ వాయిదాపడింది. జూన్ 27 (రేపటి) నుంచి ప్రారంభం కావాల్సిన ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ షెడ్యూల్ వాయిదా పడింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్, బీఈ సీట్ల భర్తీకి నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు జరిగాయి.
జులై 4 నుండి….
జులై 4 నుంచి ఇంజినీరింగ్ తొలి విడత ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 6 నుంచి 13 వరకు తొలి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్, జులై 8 నుంచి 15 వరకు తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం, జులై 19న ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. జులై 26 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించి.. జులై 27 న రెండో విడత కౌన్సెలింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. జులై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. జులై 31న ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేసి ఆ తర్వాత ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆగస్టు 9న మూడో విడత కౌన్సెలింగ్కు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టి.. 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఆగస్టు 13న ఇంజినీరింగ్ మూడో విడత సీట్ల కేటాయింపు నిర్వహిస్తారు. ఆగస్టు 21 నుంచి కన్వీనర్ కోటా ఇంటర్నల్ స్లైడింగ్కు అవకాశం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.