Bollywood – ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శత్రుఘ్నసిన్హా

ముంబయి : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, టీఎంసీ పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్నసిన్హా (77) తీవ్రజ్వరంతో ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్‌ సిన్హా ఆదివారం వెల్లడించారు. ఆయనను ఆసుపత్రికి ఎప్పుడు తీసుకువెళ్లారనేది సష్టత లేదు. ”నాన్నకు తీవ్రజ్వరంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లాం. అలాగే సాధారణంగా చేయించే అన్ని వైద్యపరీక్షలు చేయిస్తున్నాం” అని లవ్‌ సిన్హా చెప్పారు. జూన్‌ నెల మొదటివారం వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమబెంగాల్‌లోని ఆసన్‌సోల్‌ నియోజకవర్గం నుంచి సిన్హా విజయం సాధించారు. 1969లో సినీరంగ ప్రవేశం చేసిన శత్రుఘ్నసిన్హా ‘మేరే అప్నే’, ‘కాళీచరణ్‌’, ‘విశ్వనాథ్‌’, ‘కాలాపత్థర్‌’, ‘దోస్తానా’ వంటి చిత్రాలతో స్టార్‌ నటుడిగా ఎదిగారు. వారం రోజుల కిందటే ఆయన కుమార్తె, బాలీవుడ్‌ కథానాయిక సోనాక్షీసిన్హా వివాహం సహనటుడైన జహీర్‌ ఇక్బాల్‌తో జరిగింది. ఈ కార్యక్రమాలతో జూన్‌ నెలంతా శత్రుఘ్నసిన్హా బిజీగా గడిపారు. ఆయనకు చిన్నపాటి శస్త్రచికిత్స జరిగిందన్న కథనాలను లవ్‌ ఖండించారు. శత్రుఘ్నసిన్హా చికిత్స పొందుతున్న ఆసుపత్రికి నూతన వధూవరులు సోనాక్షి, జహీర్‌ వచ్చి వెళ్లారు.

➡️