ప్రశంసాపత్రంతో హరికృష్ణ
ప్రజాశక్తి- ఆమదాలవలస
మండలంలోని ఆర్ఆర్ కాలనీకి చెందిన సైతక శిల్పి గేదెల హరికృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఒడిషా రాష్ట్రం పూరీలో ప్రతిఏటా జరిగే ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ పోటీల్లో పాల్గొని ఉత్తమప్రతిభ కనపర్చినందుకు సిల్వర్ కోణార్క్ షీల్డ్తో సత్కరించి ప్రశంశా పత్రంతో పాటు ఉత్తమ అవార్డును అందించినట్లు సైకత శిల్పి గేదెల హరికృష్ణ తెలిపారు. ప్రఖ్యాత దేవాలయాలు, వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ సైతక శిల్పాన్ని వేయాలని నిర్వాహకులు తెలుపగా తాను జిల్లాలోని ప్రఖ్యాత దేవాలయం శ్రీ కూర్మానాథ దేవాలయం శిల్పాన్ని ఆవిష్కరించడంతో సెలెక్ట్ కమిటీ సభ్యులు మెచ్చుకొన్నారని, వీటితో పాటు మరో రెండు శిల్పాలలో ఉత్తమ ప్రతిభ కనపర్చినందుకు ప్రధమ విజేతగా ప్రకటించారని పేర్కొన్నారు. ఒడిషా ప్రభుత్వం తన ప్రతిభను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం పట్ల హరికృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో అమెరికా, రష్యా, చెక్ రిపబ్లిక్, శ్రీలంకతో పాటు పలు దేశాలకు చెందిన 120 మంది కళాకారులు పాల్గొన్నారని తెలిపారు.