కలెక్టర్, ఎస్పితో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి – పలాస
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పలాసలో పర్యటించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. పలాసలోని 200 పడకల ఆస్పత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభలో సిఎం ప్రసంగిస్తారని తెలిపారు. సిఎం పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్ స్థలం, బహిరంగ సభ ప్రాంతాలను కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఎస్పి జి.ఆర్ రాధికతో కలిసి గురువారం పరిశీలించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. బహిరంగ సభ ప్రాంగణంలో వాహనాల పార్కింగ్, విఐపి గ్యాలరీ ఏర్పాటు చేయాలని చెప్పారు. హెలీప్యాడ్ను సిద్ధం చేస్తున్న లేఅవుట్లో విద్యుత్ స్తంభాలను తొలగించి, సిఎం పర్యటన అనంతరం తిరిగి ఏర్పాటు చేయాలని కలెక్టర్ విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి నుంచి బహిరంగ సభ నిర్వహించే కాశీబుగ్గ రైల్వే మైదానం వరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలాస ఆర్డిఒ భరత్ నాయక్, కాశీబుగ్గ డిఎస్పి నాగేశ్వర్రెడ్డి, ఆర్అండ్బి ఎస్ఇ జాన్ సుధాకర్, ఇఇ సత్యనారాయణ, ఇపిడిసిఎల్ ఎస్ఇ ఎన్.కృష్ణమూర్తి, డిపిఒ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.