హైటెక్ దందాతో భూముల ఆక్రమణకలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్కు ప్రజాసంఘాల ఫిర్యాదు ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): ‘దేశ నాయకుల విగ్రహాలను పెట్టి ప్రైవేటు భూములను కాజేస్తున్నారు..’ అంటూ స్వామీ హథీరాం బావాజీ మఠం పరిరక్షణ సమితి, ఎస్సీ, బిసి సంఘాల నాయకులు కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లకు సోమవారం నిర్వహించిన స్పందనలో ఫిర్యాదు చేశారు. తిరుపతి రూరల్ సర్వే నెంబర్ 242/బి4లో ఉన్న ఖాళీ స్థలంలో తిరుపతి రూరల్ మండలం అవిలాల శానప్ప కాలనీకి చెందిన శివ, శంకర్, వినాయకం, మోహన్, యాదగిరి తదితరులు భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అడ్డుగా వచ్చిన వారిపై దాడి చేశారని అధికారులకు తెలిపారు. భూమిని కాజేసేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాత, యావత్ భారతావనికి ఆరాధ్యులైన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని భూములను కాజేసేందుకు స్వార్ధం కోసం వాడుకుంటున్నారన్నారు. గతంలో ఇదే విధంగా అనేక భూములను ఆక్రమించారని, వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్వామీ హథీరాం బావాజీ మఠం పరిరక్షణ సమితి కోశాధికారి అశోక్ నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్ నాయక్, ఇసి మెంబర్ హరి నాయక్, బిసి సంఘం నాయకులు మురళి, శంకర్ యాదవ్, ఎస్సీ సంఘం నాయకుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.