ప్రజాశక్తి-తిరుమల : త్వరలో ఎల్.ఎన్.జి స్టేషన్ ను ఏర్పాటు చేసి, పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో ప్రైవేటు ఆహార విక్రయకేంద్రాల్లో ఎల్.పి.జి గ్యాస్ స్టవ్ లు క్రమంగా నియంత్రిస్తామని ఆయన తెలిపారు. అగ్నిప్రమాదాలను నివారించేందుకే ఎల్.పి.జి సిలిండర్ల స్థానంలో ఎల్.ఎన్.జి పైపులైన్ త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు. శ్రీవారి దర్శనానికి భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాంప్లెక్స్, క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా టైంస్లాట్ విధానాన్ని మరింత పెంచాలని యోచన చేస్తుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 16న రథ సప్తమిని వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒకేరోజు మలయప్పస్వామి సూర్యప్రభ మొదలు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. మాడ వీధుల్లో ఉండే భక్తులకు పాలు, అల్పాహారం పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. హిందూయేతర భక్తులకు ఆఫ్ లైన్ లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తామని తెలిపారు.