ప్రజాశక్తి – తాళ్లరేవుజీవవైవిద్యానికి ఎంతగానో దోహదం చేసే నీటి పిల్లుల సంరక్షణ బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.భరణి అన్నారు. చొల్లంగిలోని కోరంగి పర్యాటక కేంద్రంలో కోరింగ వైల్డ్ లైఫ్ రేంజ్ ఆధ్వర్యంలో నీటి పిల్లుల దినోత్సవ ముగింపు కార్యక్రమం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ఎస్ఆర్.వరప్రసాద్ అధ్యతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిఎఫ్ఒ భరణి హాజరై మాట్లాడారు. విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన ఉండాలని, నూత్న ఆలోచనలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి పర్యావరణపై అవగాహన కల్పించారు. మానవ తప్పిదాల వల్ల జీవజాతులు అంతరించిపోతున్నాయని చెప్పారు. అలాంటి వాటిలో నీటి పిల్లులు ఒకటన్నారు. వాటిని సంరక్షించుకోవడానికి దినోత్సవాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నీటి పిల్లుల పోస్టర్లను ఆవిష్కరించారు. రెండు నిమిషాల నిడివిగల నీటి పిల్లుల డాక్యుమెంటరీని విద్యార్థులకు చూపించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ఎంజివి.ప్రసాద్, సిద్ధార్థ కుమార్, అరుణ, వసంత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కె.గోపీనాగేంద్రకుమార్, మహేష్, ప్రసాద్, ధనుంజయరావు, ఆదిత్య కళాశాల ప్రతినిధులు టి.తేజేశ్వరరావు, దివాకర్ రావు, సిబ్బంది, ఆదిత్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.