సమీక్షిస్తున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
- కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేశామని, ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు తమ దృష్టికి తీసురావాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణపై అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, అసెంబ్లీ సిట్టింగ్ సభ్యులతో కలెక్టరేట్లో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2357 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, పాతపట్నంలో అదనంగా ఒక సహాయ పోలింగ్ కేంద్రాన్ని అవసరం మేరకు ఏర్పాటు చేస్తామని అన్నారు. పాతపట్నం పోలింగ్ కేంద్రం నంబరు 291లో 1635 ఓట్లు ఉన్నాయని, 1,500 మంది కంటే అధికంగా ఓటర్లు ఉంటే మిగిలిన ఓటర్లకు మరో సహాయక పోలింగ్ కేంద్రం ప్రతిపాదించవచ్చన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో రెండు పాత కేంద్రాలను కొత్త చోటుకి మార్పు చేశామని, ఇవి మినహా జిల్లాలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. 115 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పుపోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలు అప్ గ్రేడ్ కారణంగా జిల్లాలో 115 కేంద్రాల పేర్లు మాత్రమే మారాయని, కానీ, అవి ఉండే స్థానాలను మార్చలేదని ఈ విషయాన్ని గమనించాలని కోరారు. జిల్లాలో అత్యధికంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో 42 పోలింగ్ కేంద్రాల పేర్లు మారగా, శ్రీకాకుళం, పలాస నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. ఆ తర్వాత నరసన్నపేటలో 25, ఆమదాలవలసలో 22, పాతపట్నంలో 11, టెక్కలిలో 8, ఎచ్చెర్లలో 7 పోలింగ్ కేంద్రాల పేర్లు మారినట్టు వివరించారు. వీటిపై ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో జాబితాను ఆమోదించి పోలింగ్స్టేషన్ల హేతుబద్ధీకరణ పూర్తి చేశామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, శ్రీకాకుళం ఆర్డిఒ సిహెచ్.రంగయ్య, పి), డి.గోవిందరావు (సిపిఎం), రౌతు శంకరరావు, మాధవరావు (వైసిపి), కింజరాపు ప్రసాద్, పి.ఎం.జె.బాబు (టిడిపి), దేసెళ్ల మల్లిబాబు (కాంగ్రెస్), బిర్లంగి ఉమామహేశ్వరరావు, సురేష్ బాబు సింగ్ (బిజెపి) పాల్గొన్నారు.