ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. రిలయన్స్, ఐటీసీ, నెస్లే వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 21,450 ఎగువన ముగిసింది.సెన్సెక్స్ ఉదయం 71,479.28 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే అమ్మకాల ఒత్తిడితో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. దీంతో ఇంట్రాడేలో 71,071 కనిష్ఠాన్ని తాకింది. తర్వాత మళ్లీ కోలుకున్న సూచీ 71,623.71 పాయింట్ల వద్ద గరిష్ఠానికి చేరుకుంది. చివరికి 122.10 పాయింట్ల లాభంతో 71,437.19 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 34.45 పాయింట్ల లాభంతో 21,453.10 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.18గా ఉంది.సెన్సెక్స్ 30లో నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీ, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. మెటల్, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఎఫ్ఎంసీజీ షేర్ల రాణించగా.. ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఐటీ షేర్లు డీలాపడ్డాయి.