గన్నవరం (విజయవాడ) : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జులై 1వ తేదీ నుంచి కార్గో సేవలు పున: ప్రారంభం కానున్నాయి. కార్గో సర్వీసుకు 2021లో ముందడుగుపడినప్పటికీ కరోనా కారణంగా ఆగిపోయాయి. తాజాగా కార్గో సేవల పునరుద్ధరణకు పిలిచిన టెండర్ను ఒమేగా ఎంటర్ప్రైజెస్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయమై విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి శనివారం మాట్లాడుతూ …రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తులైన చేప, రొయ్యలతోపాటు పూలు, పండ్లు, మిర్చి, తదితర ఉత్పత్తులను దేశంలోని ఏ ప్రాంతానికైనా సరసమైన ధరలలో గంటల వ్యవధిలో చేర్చడానికి కార్గో సర్వీసు దోహదపడుతుందన్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ సర్వీసును నడపడానికి కస్టమ్స్ అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు.