RBI : ఆర్బిఐ ఆదేశాలు, చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకుగాను … రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఓ ప్రైవేటు బ్యాంక్పై కఠిన చర్యలు తీసుకుంది. నాలుగు ఎన్బీఎఫ్సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను రద్దు చేసింది. అలాగే ఓ ప్రైవేటు బ్యాంకుకు రూ.1 కోటి జరిమానా విధించింది. ‘రుణాలు, అడ్వాన్సులు – చట్టబద్ధమైన ఇతర పరిమితులు’పై ఆర్బిఐ మార్గదర్శకాలను పాటించనందుకుగానూ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు రూ.1 కోటి పెనాల్టీ విధించింది. తమ ఆదేశాలు, చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ బ్యాంకుకు ఇదివరకే షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బిఐ స్పష్టం చేసింది.
ఆర్బీఐ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కంపెనీలలో … ఉత్తరప్రదేశ్కు చెందిన కుండల్స్ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడుకు చెందిన నిత్య ఫైనాన్స్ లిమిటెడ్, పంజాబ్ ఆధారిత భాటియా హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్, హిమాచల్ ప్రదేశ్ ఆధారిత జీవన్జ్యోతి డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ లిమిటెడ్ ఉన్నాయి. ఆర్బీఐ చట్టంలో నిర్వచించిన విధంగా ఈ కంపెనీలు ఇప్పుడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వ్యాపార లావాదేవీలను నిర్వహించలేవు.