ముంబయి : అమ్మకాల ఒత్తిడితో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండిస్టీస్, బ్యాంకింగ్ స్టాక్స్ ఒత్తిడికి గురి కావడంతో సెన్సెక్స్ 523 పాయింట్లు లేదా 0.73 శాతం పతనమై 71,072కు పడిపోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 166 పాయింట్లు కోల్పోయి 21,616 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలకు తోడు సానుకూల ప్రభావం చూపే అంశాలు లేకపోవడం మార్కెట్ల నష్టాలకు ప్రధాన కారణమయ్యాయి. రిలయన్స్ సూచీ 0.66 శాతం తగ్గి రూ.2,902.95 వద్ద ముగిసింది. నిఫ్టీలో పిఎస్యు బ్యాంకింగ్, రియాల్టీ, మీడియా, లోహ సూచీ 4.5 శాతం వరకు నష్టపోయాయి. బిఎస్ఇలో మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.6 శాతం, 3 శాతం చొప్పున విలువ కోల్పోయాయి.