ప్రజాశక్తి – యంత్రాంగం
అంగన్వాడీ కేంరదాలను అక్రమించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు అధికారయంత్రాంగంతో దుశ్చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగా కేంద్రాల తాళాలలు పగులగొట్టించింది. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సైతం భాగస్వాములు అయ్యారు. జగ్గంపేట రూరల్ మండల పరిషత్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు మండలంలోని అంగన్వాడీ సెంటర్లకు వేసిన తాళాలను పగులకొట్టారు ఒక మహిళను ఇన్ఛార్జ్గా నియమించి బలవంతంగా చిన్నారులను రప్పించి భోజనం పెట్టారు. ఏలేశ్వరం ప్రభుత్వ కవ్వింపు చర్యల్లో భాగంగా ప్రత్తిపాడు మండలంలోని 11 అంగన్వాడీ కేంద్రాలకు చెందిన తాళాలను సచివాలయ సిబ్బందితో బద్దలు కొట్టించారు. ఏలేశ్వరం మండలంలో 8 సెంటర్లకు సంబంధించిన తాళాలను బద్దలు కొట్టించారు. కరపలో తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్లను తెరిపించడంపై అంగన్వాడీ కార్యకర్తలు ఎస్ఐ ఎన్.రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ సెక్టర్ నాయకులు పి.వీరవేణి మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నామని, అయితే తమ ప్రమేయం లేకుండా కొందరు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టినట్లు తమకు తెలిసిందన్నారు. రికార్డులు, సామాన్లు ఉపోతే పూర్తి బాధ్యత తాళాలు పగలగొట్టిన వారిదేనన్నారు. వారిని బాధ్యులుగా చేయాలని ఎస్ఐని కోరారు. ఎస్ఐని కలిసి ఫిర్యాదు చేసిన వారిలో ఎస్ వరలక్ష్మి, నారాయణమ్మ, కె.కల్పలత, జ్యోతి, హైమ, సిహెచ్ సూర్యకుమారి, విజయ రత్నం, తదితరులు పాల్గొన్నారు.తాళ్లరేవు మండలంలో పలుచోట్ల అంగన్వాడీ కేంద్రాలను వైసిపి నాయకులు, సచివాలయ సిబ్బంది తాళాలు పగలగొట్టి తెరిచారు. కోరంగి పంచాయతీ సీతారామపురంలో పంచాయతీ కార్యదర్శి రామరాజు, వైసిపి నాయకులు కాదా గోవిందకుమార్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచారు. జార్జిపేటలో సచివాలయ సిబ్బంది, వైసిపి నాయకులు రెడ్డి నాగేశ్వరరావు, పెట్ల సూర్యనారాయణరాజు, చొల్లంగిపేటలో మైదు హరిబాబు, సచివాలయ సిబ్బంది తాళాలను పగులగొట్టారు.