ఫొటో : మాట్లాడుతున్న ఎస్.కె.రెహనాబేగం
అంగన్వాడీ మృతికి ప్రభుత్వానిదే బాధ్యత
– అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్.కె.రెహనాబేగం
ప్రజాశక్తి-కావలి రూరల్ : అంగన్వాడీ వర్కర్ల డిమాండ్ల పరిష్కారం కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 16వ రోజుకు చేరింది. వారి డిమాండ్ల పరిష్కారానికి నాలుగుసార్లు ప్రభుత్వం చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించకపోవడంతో తమకు న్యాయం జరుగుతుందా లేదా అనే ఆవేదనతో కుంగిపోయి ఆత్మకూరు ప్రాజెక్టు దగ్గర జరిగే ఆందోళనకు బయల్దేరిన సంగం మండలం తరుణవాయి గ్రామం గాంధీ గిరిజన కాలనీకి చెందిన ఇండ్ల వనమ్మ (43) గిరిజన అంగన్వాడీ ఆందోళనకు కొంతదూరం పోయేసరికి హఠాత్తుగా కళ్లు తిరుగుతున్నాయని, పక్కనే ఉన్న హెల్పర్కు చెప్పి కుప్పకూలిపోయి అక్కడే మరణించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి డిమాండ్లను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నందున అంగన్వాడీలు రకరకాలుగా ఆందోళనలో చెందుతున్నారని మానసిక వేదనకు గురవుతున్నారని అందులో భాగంగానే ఆమె చనిపోవడం జరిగిందని దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఇండ్ల వనమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియో అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
![ఫొటో : మాట్లాడుతున్న ఎస్.కె.రెహనాబేగం](https://prajasakti.com/wp-content/uploads/2023/12/kvlrrl-2-3.jpeg)