ప్రజాశక్తి-వేంపల్లె/సింహాద్రిపురంపులివెందుల నియోజకవర్గం అభివద్ధికి నిదర్శనమని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్రెడ్డి అన్నారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డికి నివాళులర్పించారు. సింహాద్రిపురంలో రూ36.03 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఇడుపులపాయ వ్యవ సాయ క్షేత్రంలో పులివెందుల రూరల్ మండల, సింహాద్రిపురంలో వేర్వేరుగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి పాడా అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించారు. ఆయా చోట్ల సిఎం జగన్ మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయ కులకు, ప్రభుత్వ ఆశయాల ఆచరణకు సంపూర్ణ సహకారం, మద్దతునిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రిజర్వాయర్ల పరిసర ప్రాంత గ్రామాల్లోని గ్రామస్థులకు, రైతులకు ఏవైనా సమస్యలను పూర్తి వివరాలతో అందజేస్తే సంబందిత అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ అవినాష్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ధనుంజయ రెడ్డి, ఒఎస్డి కృష్ణమోహన్రెడ్డి, కలెక్టర్ వి.విజరు రామరాజు, జెసి గణేష్ కుమార్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సలహా కమిటీ మెంబర్ బలరామిరెడ్డి, మండలధ్యక్షులు, ఎంపిటిసిలు ఖాదరబాధర వరలక్ష్మి, కొమ్మా వరలక్ష్మి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సర్వోత్తం రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో సిఎం జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ప్రాల్గొన్నారు. ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని నెమళ్లు పార్కు సమీపంలో ఉన్న ప్రార్థన మందిరంలో తల్లి విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి జగన్ క్రిస్మస్ వేడుకలకు చెందిన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దాదాపు రెండు గంటల వరకు కొనసాగిన క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో సిఎం పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు, బంధువులతో సంతోషంగా సిఎం గడిపారు. బంధువులైన ప్రతి ఒక్కరికి పేరుతో సిఎం పలకరించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో సిఎం తల్లి విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ సుధీకర్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గా యపల్లి మల్లిఖార్జున రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప మేయర్ సురేష్ బాబుతో పాటు సిఎం బంధువులు, ఎమ్మెల్యేలు నాయకులు, పాల్గొన్నారు. రూ.36.02 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలుసింహాద్రిపురంలో రూ.36..02 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సిఎం జగన్ ప్రారంభోత్సవాలు చేశారు. నూతనంగా నిర్మించిన రోడ్డు వెడల్పు సుందరీకరణ పనులు, వైఎస్సార్ పార్క్, తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపిడిఒ కార్యాలయాలను ప్రారంభించారు. పాడా నిధులతో మండల కేంద్రంలో రూ.11.6 కోట్లతో నూతనంగా సుందరీకరరించిన రోడ్లు, జంక్షన్లను మొదట ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఫోర్ లైన్ సిసి రోడ్, బి.టి రోడ్ జంక్షన్లు ఉన్నాయి. అనం తరం రూ 5.5 కోట్ల నిధులతో 1.5 ఎకరాల్లో సుందరంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్కును ఆయన ప్రారంభించారు. ఎంట్రీలో ప్లాజా వాటర్ ఫౌం డేషన్, చిన్నపిల్లల ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, వైఎస్ఆర్ విగ్ర హాలను అందంగా ఏర్పాటు చేశారు. అనంతరం రూ.3.19 కోట్ల పాడానిధులతో నిర్మించిన న్యూ తహశీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ను, రూ.2 కోట్ల నిధులతో నిర్మించిన న్యూ పోలీస్ స్టేషన్ను, రూ 3.16 నిధులతో నిర్మించిన ఎంపిడిఒ ఆఫీసును ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో తహశీల్దార్ డి.మహబూబ్బాషా, ఎంపిడిఒ జి.కృష్ణమూర్తి, ఎస్ఐ రోషన్, పోలీస్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.రెండో రోజూ ఇడుపులపాయలో సిఎం బససింహాద్రిపురం మండల కేంద్రంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను ముగించుకుని సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్కు ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి చేరుకున్నారు. నాయకులు, అధికారులు సిఎంకు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద ఉన్న వైసిపి నేతలను సిఎం పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/Untitled-2-copy-20.jpg)