ప్రజాశక్తి -పార్వతీపురం: ఉపాధి కల్పన శాఖలో ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి కల్పన శాఖ రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సోమవారం విడుదల చేశారు. ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, అదనపు అర్హతల నమోదు తదితర అంశాలను ఉపాధి కల్పన శాఖ ఆన్ లైన్ సేవల ద్వారా చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ సేవలను జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్, మోడల్ కెరీర్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు, మొబైల్ ద్వారా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. సేవలు వఎజూశ్రీశీyఎవఅ్.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో అభ్యర్థులు లాగిన్ అవుతూ పొందవచ్చని చెప్పారు. లాగిన్ అయిన వారికి ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబరు వస్తుందన్నారు. అభ్యర్థి వివరాలు నమోదు అనంతరం జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆమోదించాలని, అప్పుడు ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుందని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ ఎంప్లాయిమెంట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, మోడల్ కెరీర్ సెంటర్ల సేవలను భారత ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సిఎస్) పోర్టల్తో ఆన్లైన్లో అనుసంధానించడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్, డిఆర్ఒ జె.వెంకట రావు, కెఆర్ఆర్సి ఎస్డిసి జి.కేశవనాయుడు, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆర్ వహీదా తదితరులు పాల్గొన్నారు.